తిరుపతి : తిరుమలలోని విశ్రాంతి గృహాలు, కాటేజీలు, ఏసీల్లో బస పొందే భక్తులు విద్యుత్ ఆదాకు సహకరించాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి కోరారు. తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గదుల నుంచి బయటకు వచ్చే సమయాల్లో భక్తులు తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేసేలా సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం విశ్రాంతి గృహాలు, పీఏసీలు తదితర ప్రాంతాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో పలు కాటేజీలకు నూతన మీటర్లు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కొత్తమీటర్ల ఏర్పాటు ముందు, ఆ తరువాత విద్యుత్ వాడకం ఎలా ఉంటుందనే అంశంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. తద్వారా కరెంటు ఆదాపై స్పష్టమైన అవగాహన కలుగుతుందన్నారు.
ఈ విషయంపై భక్తులకు అవగాహన కల్పించేందుకు ఎస్వీబీసీ, ఇతర ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రిసెప్షన్ సిబ్బందితోపాటు ఎఫ్ఎంఎస్ సిబ్బంది కరెంట్ ఆదాపై బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి, జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఎస్ఇలు జగదీశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, డీఈ రవిశంకర్ రెడ్డి, తిరుమల, తిరుపతి రిసెప్షన్ అధికారులు పాల్గొన్నారు.