అమరావతి : కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరులో ఆర్ఐపై హత్యాయత్నం జరిగింది. అతడిపై ఇసుక మాఫియా చేయి చేసుకుని దుర్భాషలాడారు. సకాలంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకోవడంతో రెవెన్యూ అధికారులు క్షేమంగా బతికి బయటపడ్డారు. గత కొన్ని రోజులుగా మోటూరు గ్రామంలో కాలువల వెంట అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఆర్ఐ అరవింద్ రాత్రి గ్రామానికి వెళ్లాడు. అక్కడ అధికార పార్టీకి చెందిన ఇసుక మాఫియా చేస్తున్న ఇసుక తవ్వకాలను ఆయన అడ్డుకున్నారు.
అక్రమంగా మట్టి తవ్వకాలను ఎలా జరుపుతారని ప్రశ్నించినందుకుగాను మాఫియా ఆర్ఐపై వాగ్వాదానికి దిగడంతో పాటు దాడికి పాల్పడ్డారు. జేసీబీతో ఆర్ఐపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆర్ఐ అరవింద్ పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి పోలీసుల రాకతో మాఫియా ఇసుక తవ్వకాలను నిలిపివేసింది. పోలీసులు జేసీబీతో పాటు ట్రాక్టర్ను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ఘటన విషయం తెలుసుకున్న రెవెన్యూ సంఘాల నాయకులు దాడిని తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.