అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబుకు మైండ్ లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు దీక్షపై ఆయన గురువారం స్పందించారు. టీడీపీ లైన్ దాటిందని, ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యతని స్పష్టం చేశారు. ఏం జరిగిందని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడుతారని ప్రశ్నించారు. ఈ సాకుతో బీజేపీని కలువాలని చూస్తూ.. జగన్ను గద్దె దించి పీఠం ఎక్కాలని చూస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ కొనసాగేందుకు అర్హత లేదని, ఢిల్లీకి వెళ్లి.. టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. బూతులు మాట్లాడే హక్కు కోసమే టీడీపీ ధర్నాలు చేస్తుందని ఆరోపించారు. దాడులు తప్పేనన్న సజ్జల.. ఆ ఆగ్రహానికి కారణం ఎవరు అని ప్రశ్నించారు. మిగతా పార్టీలు సైతం ఇలాంటి కుసంస్కార మాటలపై తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
బూతులు మాట్లాడడం తప్పు కాదంటే అదే విషయాన్ని చెప్పాలన్నారు. సభ్య సమాజంలో ఉండే హక్కును చంద్రబాబు, టీడీపీ కోల్పోయిందన్నారు. ఇలాంటి దౌర్భాగ్యపు పార్టీ నేతృత్వంలో రాష్ట్రం కొన్ని సంవత్సరాల పాటు ఉన్నందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. టీడీపీ నేతతో వ్యాఖ్యలు చేయించినందుకు చంద్రబాబు సీఎం జగన్తో పాటు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.