టీడీపీపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో అరెస్టై, బెయిల్పై విడుదలైన నారాయణ వ్యవహారంపై టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. నారాయణ విషయంలో కక్షసాధింపులకు దిగుతున్నామంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఓ విప్లవకారుడు అరెస్టైనట్లు చంద్రబాబు హడావుడి చేస్తున్నారంటూ తీవ్రంగా దుయ్యబట్టారు.
మాల్ ప్రాక్టీస్ గానీ, పేపర్ లీకేజీ తప్పే కాదని టీడీపీ నేరుగా చెప్పగలదా? అంటూ సజ్జల సూటిగా ప్రశ్నించారు. మాల్ ప్రాక్టీస్కు ఎగబడి, మళ్లీ తమపైనే ఎదురుదాడి చేస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంలో ఎవరు తప్పు చేసినా, వారిని వదిలేది లేదని సజ్జల స్పష్టం చేశారు.
పదో తరగతి పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేదని టీడీపీ ఆరోపణలు చేసిందని, తాము చర్యలు తీసుకుంటే మాత్రం నానా హంగామా చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. 100 శాతం ఉత్తీర్ణత కోసమే కొన్ని సంస్థలు మాల్ ప్రాక్టీసింగ్, పేపర్ లీకేజీ వంటి అక్రమాలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే నారాయణ అరెస్ట్ అయ్యారని సజ్జల వివరించారు.
పేపర్ లీకేజ్, మాల్ ప్రాక్టీస్ లాంటి ఘటనలు గత ప్రభుత్వ హయాంలోనూ జరిగాయని, అయితే ఆ ప్రభుత్వాలు వాటిని సీరియస్గా తీసుకోలేదన్నారు. కానీ.. ఈ విషయం తమ దృష్టికి రాగానే పిల్లల భవిష్యత్ దృష్ట్యా సీరియస్ అయ్యామని సజ్జల అన్నారు.
పేపర్ లీక్తో సహా పలు దారుణాలకు పాల్పడ్డ వారి విషయంలో టీడీపీ విధానమేమిటో బట్టబయలు చేయాలని సజ్జల డిమాండ్ చేశారు. పేపర్ లీకుల విషయంలో తమను నారాయణే గైడ్ చేసేవారని డీన్ బాలగంగాధర్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారని, నారాయణ మాత్రం తాను చైర్మన్ కాదంటూ సాంకేతిక కారణాలు చూపిస్తూ తప్పించుకుంటున్నారని అన్నారు.