విద్యుత్ ఛార్జీలను తమ ప్రభుత్వం మూడేళ్లుగా పెంచలేదని, ఇప్పుడు స్వల్పంగా మాత్రమే పెంచామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విద్యుత్ ఛార్జీలను స్వల్పంగా పెంచుతూ విద్యుత్ రెగ్యులేటరీ కమిటీ నిర్ణయం తీసుకుందని, హేతుబద్ధంగానే ఛార్జీలను పెంచామన్నారు. సజ్జల రామకృష్ణా రెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడారు. కరెంట్ ఛార్జీల పెంపు విషయంలో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తమ హయాంలో కరెంట్ ధరలు పెంచలేదని చంద్రబాబు తప్పుడు మాటలు చెబుతున్నారని, ప్రజలకు అన్నీ గుర్తున్నాయని హెచ్చరించారు. ఏ ప్రభుత్వం కూడా ప్రజలపై ఎక్కువ భారం మోపి, ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టాలని చూడదని, ఇలాంటి వ్యవహారాలను సీఎం జగన్ ఏమాత్రం ప్రోత్సహించరని సజ్జల స్పష్టం చేశారు.
చంద్రబాబు లాగా విచ్చల విడిగా విద్యుత్ కొనుగోళ్లను తమ ప్రభుత్వం చేయలేదని, తక్కువ ధరలకు మాత్రమే తాము విద్యుత్ను కొనుగోలు చేస్తున్నామని సజ్జల చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం విచ్చల విడిగా పెట్రో, డీజిల్ ధరలను పెంచిందని, అయినా.. టీడీపీ వాటిపై పోరాటమే చేయలేదని తప్పుబట్టారు. అలాగే బీజేపీ నేతలు కూడా కరెంట్ ఛార్జీల గురించి మాట్లాడుతున్నారని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై వారెందుకు మాట్లాడటం లేదని సజ్జల సూటిగా ప్రశ్నించారు.