శ్రీశైలం : శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లకు సోమవారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను నిరాడంబరంగా జరిపించారు. ఆలయ ప్రాకారంలోని పురాతన దీపాలంకరణ మండపంలో ప్రదోషకాల సమయంలో స్వామిఅమ్మవార్లను మండపంలో వేంచేబు చేసి షోడశోపచార పూజా క్రతువులను అర్చక వేదపండితులు ఏకాంతంగా జరిపించారు. అనంతరం 1008 దీపాలను వేదమంత్రోచ్చారణాల నడుమ వెలిగించి దీప నివేదన చేశారు. అనంతరం ఆలయ అధికారులు ఉత్సవమూర్తులను పల్లకిపై ఆలయ ప్రదక్షిణ చేయించారు.
శ్రీశైల క్షేత్రంలో రేపటి నుంచి భక్తుల కేశఖండనను నిలిపివేస్తున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో దేవస్థాన క్షౌరకుల విజ్ఞప్తి మేరకు సోమవారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 24 మంది ఆలయ క్షౌరకులు కొవిడ్ బారినపడ్డారని.. ఇద్దరు మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ ప్రభావం తగ్గే వరకు కేశఖండనశాలలు మూసివేస్తామని ఆయన తెలిపారు. భక్తులు దేవస్థాన సిబ్బందికి సహకరించాలని ఈఓ కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.