న్యూఢిల్లీ: వివిధ ఆరోపణలపై సీఎం జగన్పై ఇప్పటి వరకు 32 కేసులు ఉన్నాయని, అలాంటి వ్యక్తి విదేశాలకు వెళ్లేందుకు అనుమతించడంలో ఆంతర్యమేంటని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. సీఎంగా ఉన్నందుకు ఆయనో రూల్.. ఎంపీనైన తనకో రూలా? తననెందుకు ఏపీకి రాకుండా అడ్డుకుంటున్నారు అని ఆయన అడిగారు. తాను ఏపీకి రావొద్దని సహచర ఎంపీల వద్ద జగన్ అన్నది తన దృష్టికి వచ్చిందని, కేసులున్న తాను ఫారిన్ వెళ్తుండగా.. తన విషయంలో అలా మాట్లాడటం ఏంటన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్కో రూల్.. నాకో రూలా? అని ప్రశ్నించారు.
లా, జస్టిస్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ విశాఖలో ఉన్న విషయాన్ని కమిటీ సభ్యులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లగా.. కమిటీలో రఘురామ ఉంటే పర్యటన వాయిదా వేసుకోవాలని సూచించిన విషయం తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. రఘురామ ఏపీకి వస్తే అరెస్ట్ చేస్తామని, ఆ తర్వాత కమిటీ సభ్యులు ఇబ్బంది పడాల్సి వస్తుందని డీజీపీ హెచ్చరించినది కూడా తన దృష్టికి వచ్చిందన్నారు. ఒక ఎంపీ ప్రాథమిక హక్కులను కాలరాయడమేంటని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర పోలీసులు సీఎం ఎలా చెప్తే అలా ఆడుతున్నారని మండిపడ్డారు.