ఏలూరు: ఏలూరు టూ టౌన్ పోలీసులు అత్యుత్సాహానికి పోయి ఓ రౌడీ షీటర్ బర్త్డే వేడుకను పోలీస్ స్టేషన్లో జరిపారు. ఇది కాస్తా వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో వారిపై చర్యలు తీసుకోక తప్పలేదు. బర్త్డే వేడుక జరుపుకున్న రౌడీ షీటర్ అధికార పార్టీ కార్పొరేటర్ భర్త కావడం విశేషం.
స్థానికంగా ఉన్న రౌడీ షీటర్లను స్టేషన్కు పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తుంటారు. ఎప్పటిమాదిరిగానే ఈ నెల 18 న కొందరు రౌడీ షీటర్లు పోలీస్ స్టేషన్కు వచ్చారు. వీరిలో భీమవరపు హేమసుందర్ కూడా ఉన్నారు. అదేరోజు హేమసుందర్ పుట్టినరోజు అని తెలుసుకున్న పోలీసులు.. అక్కడే కేక్ కోయించి శుభాకాంక్షలు తెలిపారు. బర్త్డే బాయ్ స్థానిక వైసీపీ కార్పొరేటర్ భర్త కావడంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ వేడక వీడియో స్థానికంగా వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.
ఈ వ్యవహారం కాస్తా డీఐజీ పాలరాజు వరకు వెళ్లడంతో.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించారు. రౌడీ షీటర్ బర్త్డే నిజమే అని తేలడంతో ఎస్సై కిషోర్ బాబు, కానిస్టేబుల్ రాజేష్పై సస్పెన్షన్ వేటు వేశారు. సీఐ రమణకు ఛార్జీ మెమో ఇచ్చారు. రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు.. ఇలా పోలీస్ స్టేషన్లోనే వారి పుట్టినరోజు వేడుకలు జరుపడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.