Srisailam | శ్రీశైలం దేవస్థానం పరిధిలో రహదారి నిర్మాణ పనులు బుధవారం ప్రారంభం అయ్యాయి. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు సంప్రదాయబద్ధంగా పూజాదికాలు జరిపి ఈ రహదారి పనులు ప్రారంభించారు. గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న 30 అడుగుల రహదారిని ఇరు వైపులా 15 అడుగులు విస్తరించి మొత్తం 60 అడుగుల వెడల్పుతో ఈ రహదారి నిర్మిస్తున్నారు. ఈ రహదారి పనులు పూర్తికాగానే ఇరువైపులా ఫుట్పాత్లు నిర్మిస్తారు.
వచ్చేనెలలో ప్రారంభమయ్యే మహా శివవరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది మహోత్సవాలలో జరిగే రథోత్సవాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా 60 అడుగుల విస్తీర్ణంతో ఈ రోడ్డు నిర్మిస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాగానే రహదారికి ఇరువైపులా సుందరీకరణ పనులు కూడా చేపడతారు. రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమంలో స్వామివారి ఆలయ ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఎం. నరసింహారెడ్డి, ఇంచార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పీ చంద్రశేఖరశాస్త్రి, సహాయ ఇంజనీరు సీతారమేష్ తదితరులు పాల్గొన్నారు.