కర్నూలు జిల్లా : ఏ పనికి వెళ్లినా వారిద్దరు కలిసే వెళ్తారు. చివరకు మరణంలోనూ కలిసే ఉన్నారు. ఎన్నో ఏండ్లుగా కలిసి మెలిసి ఉన్న స్నేహితులిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హృదయ విదారక ఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో శనివారం రాత్రి జరిగింది. ప్రాణస్నేహితులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో మృతుల స్వగ్రామం కప్పట్రాళ్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన బోయ సుధాకర్ (36), తెలుగు వెంకటేశ్ (38) గాఢ స్నేహితులు. ఏ పనిచేయాలన్నా ఇద్దరు కలిసి చేయాల్సిందే. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు ఉండాల్సిందే. వీరి స్నేహాన్ని చూసి మృత్యుదేవతకు కన్నుకుట్టింది. శనివారం వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్పై దేవనకొండ మండల కేంద్రానికి వెళ్లారు. పనులు చూసుకుని తిరిగి వస్తుండగా కరిడికొండ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బైక్ను కర్నూలు వైపు నుంచి ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు.
రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బోయ సుధాకర్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉండగా.. తెలుగు వెంకటేశ్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.