నెల్లూరు జిల్లా : బోగోలు మండలం కోవూరుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. మృతురాలు సర్వాయపాలెంకు చెందిన వృద్ధురాలు రమణమ్మగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కావలి మండలం సర్వాయపాలెం పంచాయతీ కోనేటివారిపాలెంకు చెందిన 15 మంది కూలీలు దగదర్తి మండలం ఉప్పరపాలెంలో మిర్చి పంట కోతకు వచ్చారు. పనులు ముగించుకుని ఆటోలో స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా చెన్నై నుంచి ఏలూరు వెళ్తున్న కారు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ అదుపు తప్పి ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. దాంతో ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న 15 మంది కూలీలు గాయపడగా, ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరికి మెరుగైన వైద్యం అందించేందుకు నెల్లూరుకు తరలిస్తుండగా సర్వాయపాలెంకు చెందిన తాత రమణమ్మ (55) మృతి చెందింది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
కారు అతి వేగంగా వస్తూ ఢీకొట్టడంతో ఆటో రెండుసార్లు బోల్తా పడింది. దాంతో కూలీలంతా రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న బిట్రగుంట ఎస్ఐ చినబలరామయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో కావలి ఏరియా దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటం మెరుగైన వైద్యం కోసం వారిని నెల్లూరుకు తరలించారు.