అమరావతి : ఏపీ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సచివాలయం మూడో బ్లాక్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. రివర్స్ పీఆర్సీ తమకు వద్దని, 10 సంవత్సరాల సీపీసీ వద్దని, 5 సంవత్సరాల ఎస్పీసీ కావాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కొత్త పీఆర్సీ వల్ల పెరగవలసిన జీతాలు వెనక్కిపోతున్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తుందని ఆరోపించారు. ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి కొత్తవేతన స్కేళ్ల బిల్లులు చేయించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. చలో విజయవాడను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని , అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ఇవ్వాలని, పాత జీతాలు చెల్లించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనను కొనసాగిస్తున్నారు.