తిరుమల: వైకుంఠ ద్వార దర్శనం కోసం స్థానికులకు మాత్రమే ఈ నెల 13 నుంచి 22 వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నారు. రోజుకు 5 వేల టికెట్ల చొప్పున 50 వేల సర్వదర్శనం కోసం ఏర్పాట్లు చేసింది టీటీడీ. తిరుమలలో జనవరి 13న వైకుంఠ ఏకాదశికి వచ్చే భక్తులకు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై టిటిడి సీవీఎస్వో గోపినాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పల నాయుడు తిరుమలలో సమీక్ష నిర్వహించారు.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు ప్రత్యేక దృష్టి సారించి పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం, ట్రాఫిక్ను సక్రమంగా నిర్వహించడం, రిసెప్షన్ విభాగాల సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. అంతేకాకుండా తిరుపతిలోని ఎస్ఎస్డి కౌంటర్ల వద్ద, ఫుట్పాత్ మార్గంలో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు.