ఖైరతాబాద్ : తమ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy ) తమ సామాజికవర్గాన్ని వంద రోజుల్లో విస్మరించారని బోయ హక్కుల పోరాట సమితి(Boya Rights Struggle Samiti ) అధ్యక్షులు మీనగ గోపి ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే డాక్టర్ చెల్లప్ప కమిషన్ ( Dr. Chellappa commission) సిఫారసును పరిగణంలోకి తీసుకుని,బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం వంద రోజులు దాటిపోయినా, తమకు ఇచ్చిన మాట ఊసెత్తడం లేదని వాపోయారు. ఇప్పటి వరకు బోయలు చట్టసభల్లో అడుగుపెట్టలేదన్నారు.
బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడంతో పాటు మరో హామీ అయిన ఎమ్మెల్సీ (MLC) కూడా ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని సూచించారు. సామాజిక న్యాయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు రాజేశం, నర్సయ్య, అంజయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.