శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో మహోత్సవాలు, పర్వదినాలు, ప్రత్యేక రోజుల్లో అధిక ధరలతో జరుగుతున్న విక్రయాలను కట్టడి చేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. తాజాగా రాష్ట్ర దేవాదాయ శాఖ శుక్రవారం సాయంత్రం ఏడు ముఖ్యంశాలతో కూడిన ప్రకటన జారీ చేసింది. ప్రధానంగా ఆలయ ఈవోతో పాటు సివిల్ ఇంజినీరింగ్ అధికారులను కూడా బాధ్యులను చేయగా రేపటి నుంచే ఆంక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో లవన్న తెలిపారు. దేవస్థాన రెవెన్యూ విభాగం నుంచి అనుమతి పొందిన అవుట్లెట్లతోపాటు పాటు నిత్యవసరాలు, కూరగాయలు, పూలు, పూలమాలలు, కొబ్బరికాయలు, కూల్డ్రింక్స్, హోటళ్లు, ఫ్యాన్సీ, చిరువ్యాపార నిర్వాహకులు కూడ ధరల పట్టికను ఏర్పాటు చేసి అనుసరించాలని నోటీసులు జారీ చేయనున్నారు.
అదేవిధంగ గత రెండు రోజులుగా సేల్స్ టాక్స్, తూనికలు కొలతల శాఖ అధికారులు క్షేత్రంలో పర్యటిస్తూ విస్తృత సోదాలు చేపట్టారు. ప్రధాన కూడళ్లలోని పలు వ్యాపారకేంద్రాల్లో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నట్లు ధ్రువీకరించారు. మూడువేల నుంచి పదివేల వరకు జరిమానాలు విధించినట్లు సంబందిత అధికారులు తెలిపారు. ఆయా వ్యాపార కేంద్రాల్లో ఇవే ఘటనలు పునరావృతం అయితే వ్యాపార లైసెన్సులు రద్దు చేసి దుకాణాలు సీజ్ చేయనున్నట్లు అదికారులు హెచ్చరించారు.