అమరావతి : ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సుప్రీంకోర్టు (Supreme Court) లో ఊరట లభించింది . బాబాయి వివేకా(Viveka) హత్యకేసుపై మాట్లాడవద్దని కిందిస్థాయి కోర్టులు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేస్తూ స్టే (Stay) ఇచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య నిందితులను శిక్షించాలని, నిందితులను సీఎం జగన్ (CM Jagan) వెనకేసుకొస్తున్నాడని ఆరోపిస్తూ కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల (YS Sharmila) ఎన్నికల్లో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
ఈ హత్య కేసు కోర్టులో ఉన్నందున కేసుపై ఎవరూ కూడా మాట్లాడ వద్దని కడప వైసీపీ అధ్యక్షుడు కడప కోర్టులో పిటిషన్ (Petition) దాఖలు చేశారు. దీంతో కోర్టు ఏప్రిల్ 16న వివేకా హత్య కేసుపై మాట్లాడవద్దని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ షర్మిల హైకోర్టు(High Court) కు వెళ్లగా ఆమె పిటిషన్ను కొట్టి వేసింది. దీంతో ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
శుక్రవారం కేసు విచారణకురాగా జస్టిస్ గవాయ్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని, వాక్ స్వాతంత్య్రం స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని పేర్కొంది. ప్రతివాదుల వాదన వినకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తదుపరి విచారణ వేసవి సెలవుల తరువాత చేపడతామని స్పష్టం చేసింది.