అమరావతి : సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, ప్రాచీన కట్టడాలు, తదితర కారణాల వల్ల ఆ ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఒక ఆవు జాతి వల్ల ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుంది చిత్తూరు జిల్లా పుంగనూరు గ్రామం. పుంగనూరు ఆవుకు అనేక ప్రత్యేతలు ఉండడం కారణంగా ఇటీవల పోస్టల్ శాఖ‘ పుంగనూరు జాతి ఆవు’ పేరిట పోస్టల్ స్టాంప్ విడుదల చేయడంతో ఆ గ్రామం , ఆవు జాతి గురించి అందరూ చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే ఒంగోలు జాతి ఆవులతో ఆంధ్రప్రదేశ్కు గుర్తింపు రాగా పుంగనూరు పొట్టి జాతి ఆవులతో మరో గుర్తింపు రావడం విశేషం. ఇక ఆవు విశిష్టత గురించి తెలుసుకోవాలంటే ప్రపంచంలోనే అతిపొట్టి జాతి ఆవులివి. 70–90 సెం.మీ ఎత్తు అంటే సుమారు రెండు అడుగుల ఎత్తు, 115 నుంచి 200 కిలోల బరువు ఉంటుంది . లేత బూడిద, తెలుపు రంగులో విశాలమైన నుదురు, చిన్న కొమ్ములు కలిగి ఉంటాయి. ఇవి రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల పాలు ఇస్తాయి. సాధార ఆవుపాలలో ఔషధ విలువలతో పాటు 3 నుంచి 3.5 వరకు వెన్న శాతం ఉంటుంది. అదే పుంగనూరు ఆవు పాలలో 8 శాతం ఉంటుంది. ఎస్ఎన్ఎఫ్ (సాలిడ్స్ నాట్ ఫ్యాట్) 9 శాతం ఉంటుంది. దీనివల్ల పాలకు అధిక ధర లభిస్తుంది.
అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానాల గోశాలలో పుంగనూరు ఆవులను పెంచుతూ ఈ ఆవు పాల నుంచి వచ్చే నెయ్యిని శ్రీవారి అభిషేకానికి వాడుతుండడం మరో విశిష్టత . కరువు పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవటం వల్ల గతంలో పేదవాడి ఆవులుగా పేరుపొందాయి. ప్రస్తుతం వీటి మార్కెట్ విలు లక్షల్లో ఉంటుంది. రెండు తెలుగురాష్ట్రాల్లో ఉన్న పుంగనూరు ఆవుల సంఖ్య కేవలం మూడువందలు మాత్రమే. అవి కూడా పుంగనూరు ఆవుల కోసం ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రాల్లో మాత్రమే ఉన్నాయి. మిగిలినవి కొంతమంది ధనవంతుల ఇళ్లలో స్టేటస్ సింబల్ గా ఉన్నాయి.
ఇప్పుడు ఈ జాతి ఆవులు అంతరించి పోయే దశలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుంగనూరు జాతి ఆవుల మనుగడకు, పునరుత్పత్తికి రూ.63 కోట్ల వ్యయంతో ‘మిషన్ పుంగనూరు రీసెర్చ్ ప్రాజెక్టు’ అమలుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం సహకారంతో కడప జిల్లా పులివెందులలోని ఏపీ సెంటర్ ఫర్ అడ్వాన్డ్స్ రీసెర్చ్ ఆన్ లైవ్స్టాక్ లిమిటెడ్లో ఐవీఎఫ్ సాంకేతికతో పుంగనూరు జాతి పశువులను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది.