అమరావతి : ఆంధ్రప్రదేశ్ మరోసారి ముందస్తు ప్రణాళిక, ఏర్పాట్లు చేపట్టకుండా జిల్లాల పునర్విభజన చేసిందని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా కార్యాలయాకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం పరిపాటిగా మారిందని విమర్శించారు.
ఏపీ రాజధాని అమరావతిపై ఇచ్చిన హైకోర్టు తీర్పుపై అఫిడవిట్ దాఖలు చేయడం శోచనీయమన్నారు. రాజధాని అమరావతిలో కేంద్ర సంస్థల కార్యాలయాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన మండి పడ్డారు. అమరావతిలో భూములు కొన్న వారు పెట్టుబడి పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, కేంద్రం కూడా తమ సంస్థలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధికి నోచుకోని నీటి ప్రాజెక్టులను పరిశీలిస్తామని అన్నారు.