అమరావతి : ఉత్సాహం ఉన్న యువకులను ఆర్మీలో తీసుకునేందుకు ఇవాళ్టి నుంచి విశాఖ పట్నంలో అగ్నివీర్ల నియామకం ప్రారంభమైంది. ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో 18 రోజులపాటు ఈనెల 31వ తేదీ వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ జరుగుతుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలనే ఉత్సహంతో ఉన్న ఏపీలోని శ్రీకాకుళం, ఎన్టీఆర్జిల్లాలకు చెందిన వారితోపాటు, యానాంకు చెందిన అభ్యర్థులు పెద్దసంఖ్యలో నిన్న రాత్రే విశాఖ చేరుకున్నారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కేటాయించిన తేదీలవారీగా హాజరు కావాలని సూచించి న నేపథ్యంలో తొలిరోజు రిక్రూట్మెంట్ కోసం స్టేడియానికి చేరుకున్నారు. రాత్రంతా స్టేడియం పరిసరాల్లోనే అభ్యర్థులు నిద్రపోయారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని పగడ్బంధీగా నిర్వహించేందుకు 300 మందికి పైగా ఆర్మీ అధికారులు, సిబ్బందితో పాటు 500 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
పరీక్షలు జరిగే స్టేడియంలోపల, అభ్యర్థులు వచ్చే మార్గాల్లో భారీకేడ్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకోసం ఎక్కడికక్కడ సమాచారం తెలిపే ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. వీరికితోడు మెడికల్, రెవెన్యూ సిబ్బంది అదనంగా నియమించారు జిల్లా అధికారులు.