Amalapuram | అమలాపురం ఎంపీ టికెట్పై అధికారిక వైసీపీలో గందరగోళం నెలకొంది. సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధకు ఈసారి టికెట్ ఇవ్వడం లేదనే తెలియడంతో ఆ సీటు ఎవరికి కేటాయిస్తారనే దానిపై కొద్దిరోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో అమలాపురం ఎంపీగా తనను పోటీ చేయమని సీఎం జగన్ సూచించారంటూ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాపాక వ్యాఖ్యలను ఎంపీ మిథున్ రెడ్డి వ్యతిరేకించారు. అధిష్ఠానం ఎంపీ టికెట్ ఇంకా ఎవరికీ డిసైడ్ చేయలేదంటూ కామెంట్ చేశారు. ఈ తతంగమంతా అమలాపురం సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధ ముందే జరగడం గమనార్హం.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో వైసీపీ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఏపీ సీఎం జగన్. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జిను మార్చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమలాపురం సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధను కూడా మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె కూడా కొద్దిరోజులుగా సైలెంట్గా ఉంటున్నారు. అయితే, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాను అమలాపురం ఎంపీగా పోటీ చేయిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. ఇలాంటి సమయంలో అమలాపురం ఎంపీగా ఎవరు పోటీ చేస్తారనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ను ఎంపీ అభ్యర్థిగా నిలపాలని జగన్ భావిస్తున్నట్లు కొద్దిరోజులగా ప్రచారం జరుగుతోంది.
జనసేన నుంచి వైసీపీలో చేరిన రాపాకకు ఈసారి.. రాజోలు అసెంబ్లీ సీటు నిరాకరించారు. దీంతో ఆయనకు అమలాపురం టికెట్ ఇవ్వాలని జగన్ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న రాపాక వరప్రసాద్.. అధిష్ఠానం తనను ఎంపీగా పోటీ చేయమని చెప్పిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని అన్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే.. ఎమ్మెల్యేగా చేస్తా.. ఎంపీగా పోటీ చేయమంటే.. ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీకి సేవ చేయాలంటే.. దానికి కూడా సిద్ధమేనని తెలిపారు. తన అంతిమ లక్ష్యం మాత్రం జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడటమే అని తెలిపారు.
రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలపై ఉమ్మడి గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. అమలాపురం టికెట్ ఇంకా ఎవరికీ డిసైడ్ చేయలేదని తెలిపారు. ఎంపీ అభ్యర్థి ఎవరనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు. రాపాక కామెంట్స్.. పూర్తిగా ఆయన వ్యక్తిగతమే అని క్లారిటీ ఇచ్చారు.