అమరావతి : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. ఈ నెల 26 నాటికి అల్పపీడనం వాయుగుండంగా బలపడే సూచనలు ఉండడంతో రాగల 3, 4 రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అల్పపీడనం ప్రభావంతో కృష్ణా, గుంటూరు. ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కోస్తాంద్ర, సీమ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడుతాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షం వల్ల అధికంగా విశాఖ జిల్లా ఆనందపురంలో 9, పెందుర్తిలో 8, తూర్పుగోదావరి జిల్లా 6, రాజమహేంద్రవరంలో 6.1, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో 5 సెంటిమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.
ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద కారణంగా ధవళేశ్వరం ప్రాజెక్టు నుంచి 9 లక్షల క్యూసెక్కుల నీటిని ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.