Budget 2024 | కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులకే రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయింపులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం రైల్వే మంత్రి మీడియాతో మాట్లాడారు.
2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీకి రూ.886 కోట్లు కేటాయించారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కానీ ప్రస్తుత బడ్జెట్లో ఒక్క ఏపీకే రూ.9,138 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణకు రూ.5,071 కేటాయించారని పేర్కొన్నారు. ఏపీలో ఏడాదికి 240 కిలోమీటర్ల ట్రాక్ పనులు జరుగుతున్నాయని.. 98 శాతం విద్యుద్దీకరణ పనులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. ఇక తెలంగాణలో రైల్వే పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని.. ఇక్కడ 100 శాతం విద్యుద్దీకరణ పూర్తయ్యిందని తెలిపారు. అమృత్ స్టేషన్ల విషయానికొస్తే ఏపీలో 72, తెలంగాణలో 40 అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. అయోధ్యకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కొత్త రైళ్లు నడిపిస్తున్నామని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాలు అవసరమని.. తమకు ఇంకా ఆ భూమి అందలేదని తెలిపారు.