అమరావతి : ఏపీలో భారీ వర్షాలతో పోటెత్తిన వరదలకు రైల్వేట్రాక్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేయగా.. పెద్ద ఎత్తున రైళ్లను అధికారులు దారి మళ్లించారు. పెన్నా నది ఉధృతంగా ప్రవహించడంతో ఏపీలో దక్షిణ, తూర్పు ప్రాంతాలను కలిపే ప్రధాన రైలు, రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. నెల్లూరు జిల్లా పడుగుపాడు వద్ద రోడ్డు తెగిపోవడంతో చెన్నై-కోల్కతా జాతీయ రహదారి-16ను మూసివేశారు.
పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్పై వరద పొంగిపొర్లడంతో పట్టాలపై మట్టి కొట్టుకుపోయి, పైకి తేలియాడుతున్నాయి. దీంతో సమాచారం అందుకున్న అధికారులు మరమ్మతు పనులు చేపడుతున్నారు. దీంతో చెన్నై – విజయవాడ మార్గంలో 17 ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. మరో మూడు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. పెద్ద ఎత్తున రైళ్లను దారి మళ్లించారు. జిల్లాలోని సోమశిల జలాశయం నుంచి రెండు లక్షల క్యూసెక్కులకుపైగా వరద నీరు వచ్చిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.
దీంతో కొవ్వూరు వద్ద జాతీయ రహదారి-16 తెగిపోయింది. దీంతో నెల్లూరు – విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపులా వేల సంఖ్యలో వాహనాలు కిలోమీటర్ల నిలిచిపోయాయి. శ్రీకాళహస్తి నుంచి వచ్చే వాహనాల రాకపోకలను తొట్టెంబేడు చెక్పోస్టు వద్ద నిలిపివేసి పామూరు, దర్శి మీదుగా మళ్లించినట్లు అధికారులు తెలిపారు. కడప జిల్లాలో కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై వంతెన కూలిపోవడంతో కడప – అనంతపురం జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
వెలిగల్లు జలాశయం నుంచి వరద నీరు రావడంతో వంతెన కూలిపోయిందని అధికారులు తెలిపారు. కడపలో ఆదివారం తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కుప్పకూలింది. అయితే సంఘటన జరగడానికి కొద్ది నిమిషాల ముందు అందులో ఉన్న వారంతా బయటకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. రెండో అంతస్తులో చిక్కుకున్న తల్లీబిడ్డలను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.