తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 6(శుక్రవారం)న పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవను నిర్వహించడం లేదని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించారు.
కాగా గురువారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . నిన్న స్వామివారిని 61,116 మంది భక్తులు దర్శించుకోగా 18,004 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చిందని తెలిపారు. వెనుకబడిన పేదవర్గాల భక్తులకు టీటీడీ రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సమయంలో శ్రీవారి దర్శనం కల్పిస్తోంది.
శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోని 190 గ్రామాల నుంచి సుమారు 9300 మంది ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి ఆహ్వానించినట్టు సమరసత సేవ ఫౌండేషన్ కార్యదర్శి త్రినాథ్ తెలిపారు.వీరికి ఉచితంగా రవాణా, వసతి కల్పించి శ్రీవారి దర్శనం చేయిస్తోందని వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనంతోపాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కూడా భక్తులు దర్శించుకుంటున్నారని తెలిపారు.