తిరుమల : శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతళ్వారు 968వ అవతారోత్సవం తిరుమలలోని అనంతాళ్వార్తోటలో టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సుమారు 300 వందల మందికి పైగా అనంతళ్వారు వంశీకులు ‘‘ నాలాయిర దివ్యప్రబంధ గోష్ఠిగానం” జరిపారు.
ఈ సందర్భంగా తిరుమల శ్రీశ్రీశ్రీ పెరియకోయిల్ కేల్వి అప్పన్ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్స్వామి మాట్లాడారు. అనంతాళ్వార్ తిరుమలలో వివిధ రకాల సుగంధభరిత పుష్పాల మొక్కలతో తోటను ఏర్పరచి స్వామివారి పుష్ప కైంకర్యాన్ని ప్రారంభించి తన జీవితాన్ని భగవంతుని సేవకు సమర్పించుకున్నారని వివరించారు. అనంతాళ్వారు వంశీకులు గతకొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం ముదావహం అన్నారు.
వివిధ శ్రీవైష్ణవ దివ్య దేశాల నుంచి వచ్చిన 15 మంది శ్రీ వైష్ణవ పండితులు ఆళ్వార్ దివ్య ప్రబంధ పఠనం చేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీలోని అన్ని ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి విజయ సారథి, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధికారి పురుషోత్తం, అనంతాళ్వార్ వంశీకులు రంగాచార్యులు, గోవిందాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.