అమరావతి : ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించారు. కడపలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించిన ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. అధిక ధరలకు హద్దులేదు. పాలకులకు బుద్దిలేదంటూ నినాదాలు చేశారు. రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వరుసగా పన్నులు పెంచుతూ ప్రజలపై భారం మోపుతుందని ఆరోపించారు.
పెంచిన విద్యుత్ ఛార్జీలు ఆరంభం మాత్రమేనని ఆగస్టులో మరోసారి ప్రభుత్వం ఛార్జీలు పెంచనుందని పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలతో పెంపు రాష్ట్రంలో మూడు వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడనుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు ఉన్నాయని ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
విజయవాడ, ఏలూరు , నెల్లూరు తదితర జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. కరోనాతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం ఆస్తిపన్ను, చెత్త పన్ను , నీటి పన్ను , వివిధ రకాల పన్నులు పెంచిందని , విద్యుత్ ఛార్జీల పెంపు మరింత భారం కానుందని గుంటూరులో నాయకులు అన్నారు.