అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాలతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు తక్కువ ఉత్తీర్ణత సాధించడం ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని ఆరోపించారు.
పాఠశాలల్లో అరకొర వసతులు, ఉపాధ్యాయుల కొరత తదితర కారణాల వల్ల విద్యార్థులకు సరైన బోధన అందలేదని అన్నారు. పది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చి వారి భవిష్యత్ కాపాడాలని కోరారు. ఉచితంగా రీ-కౌటింగ్ నిర్వహించాలని, సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు తీసుకోకూడదని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఫెయిలైతే తల్లిదండ్రులపై నెపం వేయడాన్ని తప్పుపట్టారు.
2018,19 సంవత్సరాల్లో 94శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే ప్రస్తుతం 67 శాతానికి మాత్రమే పరిమిత మవడం విద్యావ్యవస్థలో ఉన్న లోపాలకు అద్దం పడుతుందని ఆరోపించారు. ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే తల్లుల పెంపకం సక్రమంగా లేదని ప్రభుత్వంలోని బాధ్యత గల ప్రజా ప్రతినిధి వ్యాఖ్యనించడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ వాదనలు వింటుంటే అసహ్యం కలుగుతోందన్నారు. పట్టుమని పది పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేదని విమర్శించారు. గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అండగా నిలవలేదని వివరించారు.