తిరుమల : తిరుమలలో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు వెయ్యికి పరిమితం చేసింది. ఇందులో ఆన్లైన్లో 750, ఆఫ్ లైన్ లో 250 టికెట్లను జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక నుంచి శ్రీవాణి దాతలకు విమానాశ్రయం లో కరెంట్ బుకింగ్ కౌంటర్ను అందుబాటులో ఉంచామని, బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో మాత్రమే ఆఫ్లైన్ టిక్కెట్లు జారీ చేస్తారని వివరించారు.
శ్రీవాణి దాతలు బ్రేక్ దర్శనం టికెట్కి బోర్డింగ్ పాస్ను జతచేయాలని. టికెట్ పై ఎయిర్లైన్ రిఫరెన్స్తో కూడిన పీఏన్ఆర్ నంబర్ను కూడా నమోదు చేయించాలని సూచించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని సిబ్బంది బ్రేక్ దర్శన టిక్కెట్తో పాటు బోర్డింగ్ పాసును తనిఖీ చేసి దర్శనానికి అనుమతిస్తారని చెప్పారు.మాధవం విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది.
రేపటి నుంచి తిరుప్పావడ సేవ పునఃప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ ఆర్జిత సేవ రేపటి నుంచి నుంచి పునఃప్రారంభం కానుందని తెలిపారు. ఇందుకోసం యాత్రికులు తిరుమలలోని సీఆర్ఓ కౌంటర్లో నమోదు చేసుకోవాలని సూచించారు. వీరికి ఈరోజు బుధవారం సాయంత్రం 5 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 25 టికెట్లు జారీ చేస్తారని వివరించారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.20 కోట్లు
తిరుమలలో భక్తు రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 58,184 మంది భక్తులు దర్శించుకోగా 16,122 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు వచ్చిందని వెల్లడించారు.