అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ భద్రత విషయం ఆందోళన కల్గిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాని భద్రతను జాతీయ భద్రతగా పరిగణించాలని ఆయన సూచించారు. శనివారం కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు ట్వీట్ చేశారు.జాతీయ నాయకులకు భద్రత కల్పించడంలో ఏమాత్రం అశ్రద్ధ , అలసత్వం వహించవద్దని పేర్కొన్నారు.
కాగా పంజాబ్ ఘటనను వ్యతిరేకిస్తూ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షకు ముందు ఆయన మాట్లాడారు. గతంలో భద్రతా కారణాలతో ఇద్దరు ప్రధానులను కోల్పోయ్యామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి భద్రత కల్పించడంలో పంజాబ్ పోలీసులు విఫలం చెందారని ఆరోపించారు. కాంగ్రెస్ ఓర్వలేక ఇలాంటి దుశ్యర్యకు పాల్పడిందని విమర్శించారు. ఈ ఘటనపై దేశంలో చర్చ జరగాలని పేర్కొన్నారు. పంజాబ్ ఘటనపై ఎల్లుండి దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టబోతున్నామని సోము వీర్రాజు ప్రకటించారు.