తిరుపతి : తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు టీటీడీ(TTD) హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సనాతన ధార్మిక సదస్సు (Sanatana Dharmic Conference)కు ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలని ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనం సమావేశ మందిరంలో అధికారులతో ధార్మిక సదస్సుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజుల పాటు జరగనున్న సనాతన ధార్మిక సదస్సులో దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామిజీలు పాల్గొంటారన్నారు. సదస్సుకు వచ్చే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముగ్గురు సీనియర్ అధికారులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి, వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులను సంప్రదించాలన్నారు. సదస్సులో ప్రతి స్వామిజీకి ఒక లైజన్ అధికారిని నియమించి దర్శనం, వసతి, ఆహార, రవాణా తదితర కమిటీలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.