Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం పలు ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో డీ పెద్దిరాజు తెలిపారు. ఇందుకోసం జనవరి మూడో తేదీ నుంచి కొత్తగా ప్రాత:కాల సేవను ప్రారంభిస్తున్నట్లు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రాత:కాల సేవలో దంపతులు లేదా ఒకరు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఈ ప్రాత:కాల సేవ చేయించాలనుకునే భక్తులు రూ.25,116 సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ సేవా కర్తలకు వేకువ జామున జరిగే శ్రీ స్వామి వార్ల మహా మంగళహారతి దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు స్వామి వారి అంతరాలయం నుంచి భక్తులు ఈ మంగళహారతి అందుకోవచ్చు. శ్రీ స్వామి వారి గర్భాలయంలో ప్రాత:కాల సేవాకర్తలతో ప్రత్యేక పంచామృతాభిషేకం, శ్రీ అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన జరిపిస్తామని ఈఓ పెద్దిరాజు చెప్పారు.
ఈ పూజల తర్వాత సేవాకర్తలకు వేదాశీర్వచనంతో శేష వస్త్రాలుగా కాటన్ పంచ, కాటన్ కండువా, కాటన్ చీర, రవిక వస్త్రం అందజేస్తారు. వీటితోపాటు 400 గ్రాముల బరువు గల ఐదు లడ్డూ ప్రసాదాలు, శ్రీ స్వామి వారి విభూది, శ్రీ అమ్మవారి కుంకుమ, స్వామి అమ్మవార్ల చిత్ర పటం అందజేస్తామని ఈవో పెద్దిరాజు చెప్పారు. ఈ సేవలో పాల్గొనే భక్తులకు మల్లికార్జున సదనంలో ఒక రోజు ఉచిత వసతి కల్పిస్తామన్నారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉదయాస్తమాన సేవ, ప్రాత:కాల సేవకు రెండింటికి కలిపి ఆరు టికెట్లు మాత్రమే ఇస్తారని ఈఓ పెద్దిరాజు తెలిపారు. ప్రతి రోజూ ఒక టికెట్.. ఉదయాస్తమానసేవకు, ఐదు టికెట్లు ప్రాత:కాల సేవకు ఇస్తారు. సాయంత్రం నిర్వహించే ప్రదోషకాల సేవ యథావిధిగా కొనసాగుతుంది. ఈ సేవా టికెట్లు కేవలం ఆన్ లైన్లో మాత్రమే విక్రయిస్తారు. దేవస్థానం / దేవాదాయ శాఖ వెబ్ సైట్ www.srisailadevastham.org, aptemples.ap.gov.in ద్వారా భక్తులు టికెట్లు పొందొచ్చు. శ్రీశైలం మొబైల్ యాప్ ద్వారా కూడా భక్తులు టికెట్లు పొందొచ్చు. కనుక ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఈఓ పెద్దిరాజు కోరారు.