Srisailam Temple | శ్రీశైల : జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో మార్గశిరమాసం పౌర్ణమి సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అలాగే, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ పరివార దేవతలకు అర్చన, అభిషేకాలు నిర్వహించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. సాయంత్రం ఆలయ ప్రాకారంలో స్వామి అమ్మవార్లను పల్లకీలో వేంచేపు చేశారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలానంతరం క్షేత్ర గిరి ప్రదక్షిణ నిర్వహించారు. అర్చక వేదపండితులు భక్తులు శివనామస్మరణ చేస్తూ నందిమండపం నుంచి బయలువీరభద్రస్వామి ఆలయం మీదుగా సాగిన గిరిప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పౌర్ణమి సంధ్యా సమయంలో భ్రమరాంబ అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం ఊయల సేవ, పల్లకీసేవ జరిపారు.
ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి అష్టోత్తర నామావళిని అర్చకులు పఠించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా అర్చక వేదపండితులు ఉత్సవం జరిపించారు. ఉభయ దేవాలయాల్లో పౌర్ణమి ప్రత్యేక పూజా కార్యక్రమాలో భక్తులు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఉండే భక్తుల సౌకర్యం కోసం నిర్వహిస్తున్న పరోక్షసేవకు విశేష ఆదరణ లభిస్తుందని ఈవో తెలిపారు. నిత్య ఆర్జిత సేవలతోపాటు ప్రతి పౌర్ణమికి భ్రమరాంబ అమ్మవారికి జరిపే లక్ష కుంకుమార్చనలో భక్తులు తమ గోత్రనామాలను ముందుగా నమోదు చేయించుకుని అమ్మవారి శ్రీచక్రార్చన కుంకుమ ప్రసాదం స్వీకరిస్తున్నారు. పరోక్ష సేవలో పాల్గొనే భక్తులు srisailadevasthanam.org వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని ఈవో శ్రీనివాసరావు కోరారు.