Janasena | కలలు కనండి అంటూ వేదికపై నుంచి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే తప్పా యువత గురించి ఆలోచించారా..? అంటూ జనసేన నాయకురాలు, కాకినాడ మాజీ మేయర్ పీ సరోజన పవన్ కల్యాణ్తో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాదెండ్ల మనోహర్ పార్టీని సర్వనాశనం చేశారన్నారు. గతంలో కేబినెట్ హోదాలో ఉన్న వ్యక్తిగా.. విధానపరమైన అంశాలు, పార్టీ నిర్మాణం తెలిసిన వ్యక్తిగా ఉండి ఇవాళ పార్టీని ఏం చేశారని ప్రశ్నించారు.
పోల్ మేనేజ్మెంట్ లేదని.. బూత్ మేనేజ్మెంట్ లేదని, టీడీపీకి పోల్ మేనేజ్మెంట్లో 40ఏళ్ల అనుభవం ఉందని అవకాశం ఇద్దాం.. సమానంగా అడుగులేదామనని తాడేపల్లిగూడెం సభలో పవన్ చెప్పారని.. పోల్ మేనేజ్మెంట్ లేకపోతే ఇన్చార్జీల తప్పా? అంటూ నిలదీశారు. నాదెండ్ల మనోహర్ నెలకోసారి వచ్చి క్లబ్లో ఉంటూ.. రోజుంతా మీటింగ్లు పెడుతారన్నారు. మూడునాలుగురోజులుంటూ పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ చేయకుండా ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియా సాక్షిగా జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నానని.. ప్రశ్నించాలని తమ నాయకుడు పవన్ కల్యాణే నేర్పారని.. ఆయన స్ఫూర్తితోనే ఇవాళ ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానన్నారు. దశాబ్దకాలంగా పార్టీని నడిపిస్తున్నా.. ఇప్పటిదాకా పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ లేదంటే.. ఇది ఎవరి వైఫల్యం..? దీనికి పవన్, మనోహర్ సమాధానం చెప్పాల్సిందేనన్నారు. పార్టీకి భారీగా సైనికులున్నారని.. పవన్ అంటే పడిచచ్చిపోయేంత యువత ఉన్నారన్నారు.
ఆయన కోసం చొక్కాలు చించుకుంటూ.. కాళ్లు చెప్పులు లేకుండా కారు వెంట పరిగెడుతున్నారన్నారు. అయినా ఆయనకు కొంచెం కూడా జాలి కలగడం లేదా? అంటూ ప్రశ్నించారు. వారి భవిష్యత్ని సర్వనాశనం చేశారని.. దశాబ్దకాలం అంటే ఓ తరానికి భవిష్యత్ పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాయకుడు సీఎం అవుతాడని.. సీఎం అవుతాడని ఓ తరాన్ని ఆయన వెంట తిప్పించుకున్నారని.. మా సీఎం అవ్వాలని కలలుగనే యువత ఏమైపోవాలని ఆమె నిలదీశారు.