అమరావతి : వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సెల్వమణి ( Roja Selvamani ) ఏపీ ప్రజలకు భోగి , సంక్రాంతి ( Sankranthi } పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘ పాతదాన్ని దహనం చేసి కొత్తదాన్ని ఆహ్వానించే భోగి పండుగ, మన జీవితాల్లోని చెడును, బాధలను కూడా దహనం చేసి కొత్త వెలుగులు, కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
నగరి నియోజకవర్గంలోని తన నివాసంలో బుధవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్( YS Jagan ) హయంలో పేదలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అన్నింటిని నిలిపివేశారని ఆరోపించారు. పేదల చేతుల్లో డబ్బులు లేక ఏ పండుగను ఆనందంగా జరుపుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

కొత్త సంవత్సరంలో మొదటి పండుగ సంక్రాంతికి రైతన్నలకు పంట చేతికొచ్చి చేతినిండా డబ్బులు ఉండే పండుగ అని అన్నారు. అందుకు భిన్నంగా రైతన్నలకు రబీకి ఆర్థిక సహాయం అందక పోవడం ప్రభుత్వం ఇస్తామన్న రూ. 40 వేలలో కేవలం రూ.10 వేలు మాత్రమే అందించడం , వర్షాలతో నష్టపోయిన రైతన్నలకు పరిహారం అందకపోవడంతో పండుగను సంతోషంగా జరుపుకోవడం లేదని ఆరోపించారు.
వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో రైతులు ఎంతో సంతోషంగాఉండేవారని పేర్కొన్నారు. వైద్యరంగాన్ని ప్రైవేట్పరం చేయడాన్ని నిరసిస్తూ జీవోలను రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు భోగి మంటల్లో దగ్ధం చేశారని వెల్లడించారు. నగరి నియోజకవర్గలో అత్యధికంగా చేనేత కార్మికులు ఉన్నారని, వీరికి ఉచితంగా కరెంట్ ఇవ్వాలని, పవర్లూమ్లకు కరెంట్ చార్జీలను తగ్గించాలని రోజా డిమాండ్ చేశారు.