అమరావతి : ఎంతో ఆనందంగా కారు కొన్న యజమానికి అంతలోనే ప్రమాదం ఎదురైంది. ఎన్నో రోజుల నుంచి కారు కొనాలనే ఆశతో డబ్బులు పొగుచేసి కొనుగోలు చేశారు. కారుకు పూజలు నిర్వహించిన కొద్ది క్షణాల్లోనే ఆ కారు ప్రమాదానికి గురై యజమాని, కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డ వైనం విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం చిప్పాడలో చోటు చేసుకుంది.
చిప్పాడ గ్రామానికి చెందిన ఓ కుటుంబం కొత్తకారును కొనుగోలు చేసి సిటీనగర్లోని చర్చి వద్ద పూజ కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా కారును నడిపే క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్న ఏటీఎం సెంటర్లోకి దూసుకెళ్లింది. ఆసమయంలో ఏటీఎంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు అద్దాలు , ఏటీఎం అద్దాలు పగిలిపోగా యజమాని, కుటుంబ సభ్యులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. భీమునిపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.