తిరుపతి: విశాఖ స్టీల్ ప్లాంట్ను విక్రయించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అనుమతించబోమని వివిధ రాజకీయ పార్టీల నేతలు తేల్చిచెప్పారు. లాభదాయకమైన పరిశ్రమను విక్రయించే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందుకు రాష్ట్ర ప్రజలు ఆందోళనలో భాగం పంచుకుని తమతో చేతులు కలపాలని వివిధ పార్టీల నేతలు సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఏదైనా సాధించవచ్చునని, అందుకే ప్రజలు ముందు నిలిచేలా కార్యాచరణ సిద్ధం చేయాల్సిన అవసరాన్ని అఖిలపక్ష సమావేశం గుర్తించింది.
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ (వీయూపీపీసీ) ఆధ్వర్యంలో తిరుపతిలోని టీఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, వైసీపీ తదితర రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా వీయూపీపీసీ రాష్ట్ర చైర్మన్ నర్సింగరావు మాట్లాడుతూ.. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఫిబ్రవరి 23న రాష్ట్ర బంద్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం కోసం ప్రతిపక్ష పార్టీలకు చెందిన 53 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు రాజీనామా చేశారని, 32 మంది ప్రాణత్యాగాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఫ్యాక్టరీని దక్షిణ కొరియా స్టీల్ కంపెనీ పోస్కోకు అప్పగించాలని కేంద్రం యోచిస్తున్నదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా చిత్తూరు ఎంపి రెడ్డెప్ప, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు, సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, పసుపులేటి హరిప్రసాద్ (జన సేన), గొట్టిముక్కల రఘురామరాజు (టీఎన్టీయూసీ), నవీన్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్), పీ అంజయ్య (రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా) తదితరులు కూడా ప్రసంగించారు.
అనంతరం వీయూపీపీసీ చిత్తూరు జిల్లా విభాగం చైర్మన్గా ఏఐటీయూసీకి చెందిన పి.మురళి, కన్వీనర్గా ఐఎన్టీయూసీకి చెందిన ఎల్.రత్నకుమార్, సీఐటీయూకు చెందిన కందారపు మురళిని కో-కన్వీనర్గా నాయకులు ఎన్నుకున్నారు.