అమరావతి: వైఎస్ వివేకానంద హత్య కేసులో చంద్రబాబు, లోకేష్, ఇతర టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో చంద్రబాబు కనుసన్నల్లో రాజకీయపరమైన కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని చంపేలా ఈ కుట్ర జరుగుతున్నదని, ఇప్పుడిది పరాకాష్టకు చేరుకున్నదని అన్నారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వివేకానందరెడ్డి హత్య కేసును తప్పుదారి పట్టిస్తున్నారని సజ్జల చెప్పారు.
వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి మాట్లాడిన తర్వాత కూడా మౌనం వీడకపోతే కరెక్ట్ కాదని, చంద్రబాబు జగన్నాటకంలో వివేకా కుమార్తె సునీతరెడ్డి, ఆమె భర్త రాజశేఖరరెడ్డి పావులుగా మారారని చెప్పారు. ఏమాత్రం ఆధారాల్లేకుండా సునీత ఆరోపణలు చేస్తున్న ఆరోపణలే ఇందుకు నిదర్శనమన్నారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక వివేకా కుమార్తె, అల్లుడిని కలుపుకుని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ విచారణను గతంలో ప్రభుత్వం కూడా స్వాగతించిందని, చంద్రబాబు మాదిరిగా సీబీఐకి నో ఎంట్రీ అని చెప్పలేదని అన్నారు. వివేకా హత్యపై రోజుకో ఆరోపణ చేస్తూ.. ఎల్లో మీడియా దిగజారుడు కథనాలు రాస్తున్నదని సజ్జల మండిపడ్డారు.