అమరావతి : గంజాయి సాగు, అక్రమరవాణాను అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా రహదారులపై వాహనాలను తనిఖీ చేస్తు గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు.
సోమవారం ఉదయం ఒడిశా (Odisha) నుంచి అనకాపల్లి జిల్లా (Anakapalli District) గుండా లారీలో తరలిస్తున్న 912 కిలోల గంజాయిని(Ganja) పట్టుకున్నట్లు ఎస్పీ దీపిక (SP Deepika) వెల్లడించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నామని, మరో 5గురిని పట్టుకోవాల్సి ఉందని వివరించారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 45 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
అదేవిధంగా విజయవాడ (Vijayawada) లో 200 కిలోల గంజాయిని పట్టుకున్నామని డీసీపీ హరికృష్ణ వివరించారు. గంజాయ అమ్ముతున్న 120 మందిని అదుపులోకి తీసుకుని వారిపై 35 కేసులు నమోదు చేశామని తెలిపారు. అనుమానాస్పద ప్రాంతాల్లో నిఘా పెడుతున్నామని అన్నారు. పట్టుబడిన వారిపై గతంలో కేసులు కూడా ఉన్నాయని తెలిపారు. విజయవాడలో మత్తుపదార్థాలు సేవించే 150 ప్రాంతాలను గుర్తించామని , మైనర్లు సైతం గంజాయికి బానిసై విక్రయాల వైపు వెళ్తున్నారని అన్నారు.