అమరావతి : కడప జిల్లా మామిళ్లపల్లి గనిలో పేలుళ్ల ఘటన దర్యాప్తులో భాగంగా పోలీసులు శనివారం పులివెందులోని వైఎస్ ప్రతాప్ రెడ్డి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో పనిచేసే పలువురు సిబ్బందిని విచారించి పేలుడు పదార్థాల నిల్వ, విక్రయంపై వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. మామిళ్లపల్లి క్వారీలో ఈ నెల 8న జిలెటిన్ స్టిక్స్ పేలి 10 మంది మృతి చెందారు.
ఘటనలో ఇప్పటికే గని లీజుదారు, జిలెటిన్ స్టిక్స్ సరఫరాదారును అరెస్టు చేశారు. ఇదే కేసులో ఈ నెల 11న ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. ఈయన స్వయానా ఏపీ సీఎం జగన్కు బంధువు. కడప జిల్లాలోని పులివెందుల, సింహాద్రిపురం తదితర ప్రాంతాల్లో ప్రతాప్ రెడ్డి గనులను నిర్వహిస్తున్నారు. మామిళ్లపల్లి గనిలో పేలుళ్లు జరిపేందుకు ఈయన నుంచే గని లీజుదారుడు జిలెటిన్ స్టిక్స్ తీసుకెళ్లినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.