అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు పోలీసులు అతిగా ప్రవర్తించారు. ఏపీ సీఎం జగన్ ఒంగోలులో రేపు పర్యటిస్తున్న సందర్భంగా సీఎం కాన్వాయ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వాహనాలను స్వాధీనం చేసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి . ప్రకాశం జిల్లా వినుకొండ నుంచి వేముల శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరారు.
మార్గమధ్యలో ఆకలిగా ఉండటంతో బుధవారం రాత్రి ఒంగోలులోని స్థానిక పాత మార్కెట్ సెంటరులో వాహనం నిలిపి టిఫిన్ చేస్తుండగా ఓ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి బెదిరించాడు. ముఖ్యమంత్రి జగన్ ఒంగోలు పర్యటన నేపథ్యంలో.. కాన్వాయ్ కోసం వాహనంతో పాటు డ్రైవర్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము కుటుంబంతో తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు.
కారును స్వాధీనం చేసుకుని అందులో ఉన్న మహిళలు, పిల్లలను రోడ్డుపైనే ఉంచి డ్రైవర్తో సహ కారును తీసుకెళ్లారు. దీంతో ఆ కుటుంబం రాత్రి బస్టాండ్లోనే ఉండిపోయారు. ప్రయాణికుల నుంచి వాహనాలను లాక్కొని ఇబ్బందులపాలు చేయడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.