అన్నమయ్య జిల్లా : రాయచోటిలో కల్తీ మద్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రెండేండ్ల క్రితం ఇలాగే పెద్ద మొత్తంలో అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసి రికార్డులకెక్కారు. ఇప్పుడు మరోసారి అదేమాదిరిగా సీజ్ చేసిన మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్తో తొక్కించారు. గత రెండేండ్లలో దాదాపు 472 కేసులు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను మంగళవారం ధ్వంసం చేశారు.
సరిగ్గా రెండేండ్ల క్రితం జూలై 18 రూ.72 లక్షల విలువైన అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచనల మేరకు మరోసారి అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి సమీపంలో మద్యం బాటిళ్ల ధ్వంసం చేపట్టారు. జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు పరిధిలోని 172 పోలీస్ స్టేషన్లలో రెండేండ్ల వ్యవధిలో 472 కేసులు నమోదు చేసి 88 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ రాజకమల్ తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.92 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
రాయచోటి పట్టణం శివారులో పెద్ద మొత్తంలో మద్యం సీసాలను రోడ్డు రోలర్తో ధ్వంసం చేస్తున్న విషయం స్థానిక మీడియా ద్వారా తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. విశాలమైన ప్రదేశంలో మద్యం సీసాలను వరుసగా నిలబెట్టి రోడ్డు రోలర్తో తొక్కించారు. దాంతో ఆ ప్రాంతం అంతా మద్యం వాసనతో నిండిపోయింది. మద్యం బాటిళ్లను ధ్వంసం చేస్తున్న సమయంలో మందుబాబులు అయ్యో అంటూ విలపించగా.. మంచి పని చేస్తున్నారంటూ మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.