అమరావతి : కోనసీమ జిల్లాలో ఇటీవల చెలరేగిన అల్లర్లలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ వద్ద రహదారిపై వాహనం కదలకుండా మరో వాహనాన్ని పోలీసులు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. అమలాపురం పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు నందర శ్రీలక్ష్మి మాతృమూర్తి చనిపోవడంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు రావులపాలెం వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు పోలీసులకు లేదని నిలదీశారు. రాష్ట్రంలో నిర్బందకాండ కొనసాగుతుందని ఆరోపించారు. ఏపీలో ఎక్కడికి వెళ్లాలన్న పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకుంటున్నారని ఎంపీ జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు పర్యటనను పోలీసులు అడ్డుకోవడం శోచనీయమని పేర్కొన్నారు.