అమరావతి: తొలిదశలోఅనంతపురంలో, తదుపరి దశలో హిందూపురం, తాడిపత్రి పట్టణాలకు పైపులైన్ల ద్వారా ప్రతి ఇంటికి పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్జి) చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ సెల్వరాజన్ వెల్లడించారు. పైప్లైన్ గ్యాస్ సరఫరా విధివిధానాలపై చర్చించేందుకు తనను కలిసిన ఏజీ అండ్ పీ కంపెనీ అధికారులతో ఆమె చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ సహజవాయువును అన్ని అవసరాలకు వినియోగించడం వల్ల గుజరాత్ రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా కోసం అనంతపురం జిల్లాను గుర్తించడం హర్షణీయమని ఆమె పేర్కొన్నారు.
అనుమతుల జారీకి సంబంధించిన అన్ని రకాల లాంఛనాలు పూర్తి చేయాలని సంబంధిత శాఖాధికారులను ఆమె కోరారు. నగరం, హిందూపురం, తాడిపత్రి పట్టణాలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా కోసం పైప్లైన్ వేయడం వేగవంతం చేయాలని కంపెనీ అధికారులను ఆమె కోరారు. ఏజీపీ కంపెనీ ఈ ఏడాది రూ.20 కోట్లతో ఎల్సీఎన్జీ స్టేషన్ను కూడా ఏర్పాటు చేయనుంది. సింగపూర్కు చెందిన ఏజిపి కంపెనీకి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఇచ్చారు. ఇది పైపుల గ్యాస్ సరఫరా ప్రాజెక్ట్ను అమలు చేస్తుంది. ప్రాజెక్ట్లో భాగంగా, సంస్థ గృహ ,పారిశ్రామిక అవసరాల కోసం సహజ వాయువును పంపిణీ చేయనున్నది.