Vizag Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని ఆయన అన్నారు. అందుకే ఈ కర్మాగారానికి రూ. 10,000 కోట్లకు పైగా పెట్టుబడిని మద్దతుగా అందించాలని నిన్నటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. ఆత్మనిర్భర భారత్ సాధించడంలో ఉక్కు రంగానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకొని ఈ చర్య చేపట్టామని పేర్కొన్నారు .
విశాఖ స్టీల్ ప్లాంట్కు ఏటా 7.3 మిలియన్ టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నది. ఈ కంపెనీ 2023-24లో రూ.4,848.86 కోట్ల నష్టపోయింది. అంతకు ముందు 2022-23లో రూ.2,858.74 కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు పెరగడం దీనికి ప్రధాన కారణం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేంద్రమంత్రి కుమారస్వామి సైతం ప్లాంట్ను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ప్లాంట్కు రూ.18వేలకోట్ల ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ఆ తర్వాత కొద్దిరోజులకే కేంద్ర ప్రభుత్వం ఉక్కుశాఖ ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు రూ.500 కోట్లు, ముడిసరుకుకు సంబంధించి బ్యాంకు అప్పుల చెల్లింపులకు రూ.1,150 కోట్ల చొప్పున రెండు విడుతల్లో సహాయం అందించింది. తాజాగా రూ.11,440 కోట్లతో ప్యాకేజీని ప్రకటించింది.
ఇకపై అన్నీ మంచి రోజులే : చంద్రబాబు
వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమని తెలిపారు. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదని.. దీనికి ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇక అన్నీ మంచి రోజులే అని తెలిపారు.