పశ్చిమ గోదావరి జిల్లా : స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని మోదీ కలిశారు. ఆ యోధుడి కుమార్తె అయిన 90 ఏండ్ల వయసున్న పసల కృష్ణ భారతిని కలుసుకున్నారు. ఆమె పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నారు. ఆమె మేనకోడలు నుంచి కూడా ఆశీస్సులు కోరారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకా విపర్రు గ్రామంలో 1900లో జన్మించిన పసల కృష్ణమూర్తి 1921లో తన సతీమణి అంజలక్ష్మితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధేయవాదిగా సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని ఏడాది జైలు జీవితం గడిపారు. 1978లో ఆయన కన్నుమూశారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలువురు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఆంగ్లేయులపై అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి కుమార్తె పసల కృష్ణభారతికి మోదీ పాదాభివందనం చేశారు.