శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సూచించారు. మల్లికార్జున కల్యాణ మండపంలో డీఆర్డీవో శాస్త్రవేత్త కే వీరబ్రహ్మం అ ధ్యక్షతన మొక్కజొన్నతో తయారైన బయోడీగ్రేడబుల్ కవర్ల వాడకంపై జరిగిన అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఎమ్మెల్యే హాజరై, బయోడీగ్రేడబుల్ అండ్ కంపోస్టబుల్ కవర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కవర్లు వాడి పారేసిన తర్వాత 90 నుంచి 120 రోజుల్లో భూమిలో కరిగిపోయి ఎరువుగా మారుతుందని చెప్పారు. శాస్త్రవేత్త వీరబ్రహ్మం మాట్లాడుతూ భావితరాల వారికి ప్లాస్టిక్ పెనుభూతంగా మారి వాతావరణ కాలుష్యమే కాకుండా.. క్యాన్సర్ వ్యాధికి కారణమవుతుందన్నారు.
ప్లాస్టిక్ కవర్లతో జరిగే నష్టాలను తెలుపుతూ బయోడీగ్రేడబుల్ కవర్లను ఆవులు, మేకలు, బర్రెలు వంటి జంతువులు తిన్నా వాటికి ఎలాంటి ప్రాణహాని ఉండదన్నారు. శ్రీశైల దేవస్థానంలో అధికారులు ప్లాస్టిక్ను నిషేధిస్తూ చేపట్టిన మహాయక్షగానికి చేయూతనివ్వాలని డాక్టర్ రమణీ ప్రసాద్ అన్నారు. క్షేత్రానికి వచ్చే భక్తులకు స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో పాటు పర్యావరణ హితమైన శాస్త్రీయ ఉత్పత్తులను అందించాలని వ్యాపారులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ దివాకర్రెడ్డి, జాతీయ జలసాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి ఎంఏ రజాక్, ఏఐసీఎంటీ బయోటెక్నాలజీస్ ఎండీ షరీఫ్, సీని దర్శకురాలు మంజుల, శతాబ్ది మార్కెటర్స్ నిర్వాహకులు సంతోష్కుమార్శర్మ, బాలు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.