విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధనం విస్తరణకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఏపీ పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల (పీఎస్పీ) కోసం 29 స్థానాలను ఇప్పటికే గుర్తించారు. దాంతో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 1.45 లక్షల ఎకరాల్లో 33 గిగావాట్ల సామర్థ్యంతో పీఎస్పీలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ స్టడీస్ నిర్వహించిన తర్వాత భారీ కసరత్తు చేపట్టనున్నారు. విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వాల మధ్య జరిగిన సహకార సమావేశం తర్వాత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తెరపైకి వచ్చాయి.
రానున్న ఐదేండ్ల కాలంలో కనీసం 5 గిగావాట్ సోలార్ కెపాసిటీ జోడింపులను రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకున్నది. యుటిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలతో సోలార్ పార్కులను అభివృద్ధి చేయడం, పంపిణీ ఉత్పత్తిని ప్రోత్సహించడం, సౌరశక్తితో నడిచే వ్యవసాయ పంపు సెట్లను అమలు చేయడం, స్థానిక తయారీ సౌకర్యాలను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా, విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ పాలసీ కింద పెద్ద గ్రిడ్ కనెక్టెడ్ విండ్ సోలార్ పీవీ సిస్టంలను ప్రోత్సహించడం, ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క సరైన వినియోగం, కొత్త, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ప్రోత్సహించడం వంటి ప్రణాళికలు ఉన్నాయి. అలాగే, గ్రిడ్లో పునరుత్పాదకాలను ఏకీకృతం చేయడానికి, ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్లో విద్యుత్ అవసరాలను తీర్చడానికి 1350 మెగావాట్ల పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్ అభివృద్ధి చేయనున్నారు.
పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడం ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించడం ద్వారా ఈ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఆదాయాన్ని సృష్టించడం, స్థానిక ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు రాష్ట్ర పునరుత్పాదక ఎగుమతి విధానం 2020 ప్రకటించారు. ఈ విధానం ప్రకారం, విద్యుత్ను సేకరించేందుకు రాష్ట్ర డిస్కంలకు ఎలాంటి బాధ్యత లేకుండానే పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి చేయడం, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది.