Pithapuram | ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు అందరీ చూపు పిఠాపురం పైనే ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారో అని అంతా ఉత్కంఠ ఉండేది. పవన్ కళ్యాణ్పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పోటీ చేసే అవకాశం ఉందని కూడా ఒక ప్రచారం జరిగింది. సరిగ్గా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ప్రకటన చేయడానికి కొద్దిరోజుల ముందే ముద్రగడ వైసీపీలో చేరడంతో అదే జరగబోతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతనే పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ ఖరారు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్కు వంగా గీత ఎంతవరకు పోటీ ఇవ్వగలదని అంతా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వంగా గీత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కాపు అయితే.. తాను కాపు ఆడపడుచును అని తెలిపారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత.. వంద శాతం కాపుల మద్దతు తనకే ఉందని స్పష్టం చేశారు. మిగతా కులాల్లోనూ తనను అభిమానించేవారు ఉన్నారని తెలిపారు. ఓ కులాన్ని, వర్గాన్ని టార్గెట్ చేస్తూ పోటీ చేయడం ఎంతవరకు సమంజసమో ప్రత్యర్థులు నిర్ణయించుకోవాలని హితవు పలికారు. మాటలు చెప్పి వెళ్లిపోయేవారిని ప్రజలు ఎప్పటికీ నమ్మరని తెలిపారు.