Pithapuram | కాకినాడ జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు. ఈయన జనసేనలో చేరబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై నిన్నటివరకు క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఆయన జనసేనలోకి జంప్ కావాలని డిసైడ్ అయిపోయారు. ఈ విషయంపై తన అనుచరులకు క్లారిటీ కూడా ఇచ్చేశారట. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలోనే జనసేనలో చేరేందుకు దొరబాబు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబుతో పాటు పలువురు నియోజకవర్గ ముఖ్య నేతలు వైసీపీని వీడనున్నారు. వీరంతా బుధవారం నాడు వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉంది. దొరబాబు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ బరిలోకి దిగారు. ఈ క్రమంలో పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ను దొరబాబుకు వైఎస్ జగన్ నిరాకరించారు. పవన్పై పోటీగా వంగా గీతను నిలబెట్టారు. కానీ పవన్ కల్యాణ్ చేతిలో వంగా గీత ఘోర పరాజయం పాలయ్యారు. అప్పట్నుంచి వైసీపీపై దొరబాబు నైరాశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.
పైగా ఎన్నికల ముందు పెండం దొరబాబుకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కానీ జగన్ మాట తప్పారు. దీంతో దొరబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పట్నుంచి పార్టీ కార్యకలాపాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఇటీవల జగన్ ఢిల్లీలో ధర్నా చేసినా కూడా ఆయన హాజరు కాలేదు. ఈ క్రమంలోనే జనసేనలో చేరబోతున్నట్లుగా దొరబాబు సంకేతాలు ఇచ్చారు.