Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం శివరాత్రి పర్వదినం కావడంతో మల్లన్నను దర్శించుకునేందుకు దేశం నలుమూల నుంచి లక్షలాదిగా యాత్రికులు తరలివచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి పాతాళగంగ వద్ద జల్లు స్నానాలు చేసుకుని ఉచిత మరియు టిక్కెట్ దర్శనాల కోసం గంటల తరబడి క్యూ కాంప్లెక్స్లలో వేచిఉన్నారు. టైంస్లాట్స్ ప్రకారం నిర్ణీత క్యూలైన్ల ద్వారానే దర్శనాలకు అనుమతించారు.
కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులు గుక్కెడు మంచినీళ్లకోసం ఎదురు చూసి వాటర్ ప్యాకెట్ల కోసం తోపులాడుకున్నారు. ముడుపులు చెల్లించేందుకు వస్తున్న శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి మాల విరమణ, ఇరుముడి సమర్పణలు చేయిస్తున్నారు. శివదీక్షా శిబిరాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కూడా అర్చకులు దీక్షా విరమణలు చేయిస్తున్నారు. యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను దుర్వినియోగ పరచకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా ఉంచాలని ఈవో పెద్దిరాజు భక్తులను కోరారు.
దోచుకుంటున్న చిరు వ్యాపారులు
లక్షల సంఖ్యలో తరలి వచ్చిన యాత్రికులకు కావలసిన అల్పాహారాలు, మంచినీరు, శీతల పానీయాలను అధిక ధరలకు అమ్ముతూ సామాన్య భక్తులను వ్యాపారులు దగా చేస్తున్నారు. తిలకధారణతో మెదలుకుని.. ప్రసాదాలు, పసుపు కుంకుమ, విభూదిగుండ్లు, కంకణదారాలే కాకుండా ఫుట్పాత్ బండ్లపై అమ్మే తినుబండారాల ధరలు నియంత్రించాల్సిన శాఖ అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తుండటంతో సామాన్య భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అధిక ధరలే కాకుండా నాణ్యత లేని వస్తువులు ఆహార పదార్థాలు అమ్మేవారిని నియంత్రించాలని యాత్రికులు కోరుతున్నారు.